May 13,2023 18:43

సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ

ప్రజాశక్తి - దేవనకొండ
జిల్లాలో కల్తీ విత్తనాలను అరికట్టాలని, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందించి ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో రైతు సంఘం మండల కమిటీ శ్రీరాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గతేడాది కొన్ని కంపెనీల పత్తి, మిరప విత్తనాలు పంట ఉత్పత్తిలో మెరుగుగా వచ్చినా, విత్తన కంపెనీలు ఈఏడాది అదును చూసుకుని ఎంఆర్‌పి ధరల కన్నా అధికంగా అమ్ముతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. గతేడాది నకిలీ విత్తనాల వల్ల, తెగుళ్ల వల్ల దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖాధికారులు ముందు జాగ్రత్తగా తనిఖీలు చేయడం, రైతులను మేల్కొల్పడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతామని చెప్పి సరఫరా చేయడం లేదన్నారు. విత్తనం మొదలుకొని తిరిగి పంట కొనుగోలు చేసే వరకు తమదే బాధ్యత అని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. రైతులను అన్యాయానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులందరికీ పరిమితులు లేకుండా సరిపోయినన్నీ విత్తనాలు, ఎరువులు సబ్సిడీలో అందజేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సూరి, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.