ప్రజాశక్తి పుట్టపర్తి క్రైమ్ : శ్రీ సత్యసాయి జిల్లాలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య సౌకర్యం కల్పించినందుకు కలెక్టర్ను సోమవారం సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘ నాయకులు, జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కలసి విద్యాలయాలలో ఉచిత విద్య కొరకు వినతి పత్రం సమర్పించామన్నారు. స్పందించిన కలెక్టర్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీతో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యాసౌకర్యం కల్పనకు మార్గం సుగమనమైంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం ఐజెయు నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయ్యన్న గారి శ్రీనివాసులు, అక్రిడేషన్ కమిటీ మెంబర్ పుల్లయ్య తో కలిసి జర్నలిస్టులు కలెక్టర్ను శాలువాతో సన్మానించి సత్య సాయి బాబా చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మదన్ మోహన్ రెడ్డి,కేశవ , హరికృష్ణ, మురళి, వంశీ, సాయికుమార్ , నాగరాజు, గంగాధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.










