ప్రజాశక్తి -పార్వతీపురం టౌన్ : వరదబాధితుల సహాయంపై అత్యవసరంగా స్పందించిన కలెక్టర్ నిశాంత్కుమార్ చేసిన కృషి అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు, తహశీల్దార్ శివన్నారాయణతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పార్వతీపురం ప్రాంతంలో కురిసిన కుంభ వృష్టి వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించిన వరద నీటి వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో అత్యవసరంగా పరామర్శించడమే కాకుండా ప్రజల సమస్యను కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఫలితంగా అత్యవసరంగా స్పందించిన కలెక్టర్ రాష్ట్ర విపత్తుల శాఖకు సమస్యని నివేదించి అత్యవసరంగా నిధులు మంజూరు చేయిస్తూ నేడు ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేయించడమే కాకుండా పట్టణంలో బాధితులకు నిత్యావసర సరుకులైన 25 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, రూ.2 వేలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో ఆర్ఐ రామకృష్ణ, వైసిపి పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష,్ణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, కౌన్సిల్ సభ్యులు, విఆర్ఒలు, తదితరులు పాల్గొన్నారు.
వరద బాధితులకు నిత్యావసర సరుకులు నగదు పంపిణీ
స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు, తహశీల్దార్ శివన్నారాయణ, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బైపాస్ కాలనీలోని వరద బాధితులకు బియ్యం, నూనె, కాయగూరలతో పాటు 2 వేల రూపాయలు నగదును పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.










