Oct 16,2023 20:58

కలెక్బర్‌ బంగ్లా భూమిపూజలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి
అన్నమయ్య జిల్లాకు శాశ్వత కలెక్టర్‌ బంగ్లా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ వెనుక వైపున ఉన్న స్థలంలో కలెక్టర్‌ బంగ్లా నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్‌ బంగాళాకు సంబంధించిన ప్లాన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు శాశ్వత బంగాళా, క్యాంప్‌ ఆఫీసులు ఎంతో అవసరమని, నిర్మాణాలను త్వరగా పూర్తిచే యాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో కూడిన బంగ్లా నిర్మాణానికి సిద్ధమని, భావితరాలను దష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులను చేపట్టామని, త్వరగా పూర్తిచేసేందుకు అధికారులకు సూచనలు జారీ చేశామని తెలిపారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో జిల్లా కలెక్టర్‌కు శాశ్వత బంగాళా నిర్మాణానికి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాశ్వత బంగాళా నిర్మాణానికి కలెక్టర్‌ గిరీష ఎంతో చొరవ తీసుకున్నారని అభినందించారు. జడ్‌పి చైర్మన్‌ అమర్‌నాధ్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌ గిరీష చొరవతో శాశ్వత బంగాళా నిర్మాణం జరుగుతోందని, నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌బాషా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, జిల్లా ఆర్‌ అండ్‌ బి అధికారి సహదేవరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.