ప్రజాశక్తి - యంత్రాంగం
ఆరిలోవ : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆరిలోవ సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరిలోవ జోన్ అధ్యక్షులు ఐసి.నాయుడు మాట్లాడుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా తమ సంఘం నిరంతరమూ పోరాడుతుందన్నారు. ఆరిలోవ ప్రాంతంలో అత్యధికమంది ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులే ఉన్నారని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజనులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జోన్ కమిటీ నాయకులు పి.మణి, డి.నాగరాజు, ఆర్.నవీన్కుమార్, డేవిడ్, నాగేశ్వరరావు, పి.గోపీకృష్ణ, ఆర్.గణపతిరావు, సిఐటియు నాయకులు వి.నరేంద్రకుమార్, ఎ. రమణ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : జివిఎంసి 85వ వార్డు పరిధి అగనంపూడి పునరావాస కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివాడ చైత్ర భూమి యువజన సేవా సంఘం ఆధ్వర్యాన కెవిపిఎస్ 2023 క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ కార్యదర్శి టి.చిరంజీవి మాట్లాడుతూ, అన్ని వర్గాల వారికి స్వేచ్ఛ సమానత్వం కావాలని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించినప్పటికీ, పాలకులు వాటిని సక్రమంగా అమలుచేయడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిడి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, సిఐటియు నాయకులు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.










