ప్రజాశక్తి - తాళ్లరేవు తాళ్ళరేవు కేశవ స్వామి ఆలయ ఇఒ యర్రా వెంకటేశ్వరరావు విధులకు హాజరు కాకుండా అలసత్వం వహిస్తున్నారని దేవస్థానం చైర్మన్ కొల్లు శ్రీనివాసరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు దేవస్థానం డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు శనివారం విలేకరులతో మాట్లాడారు. శనివారం హాజరు పట్టికను పరిశీలించగా జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పేరు ఎదురుగా 29వ తేదీ, 30వ తేదీ ముందుగా హాజరు వేసి ఉందని, విఒ విధులకు హాజరు కాలేదని తెలిపారు. ఉద్యోగులు కొంతమంది డ్యూటీ చేయకపోయినా డ్యూటీ చేసినట్టు హాజరు వేయించుకుని దేవుని సొమ్ము జీతాల పేర డ్రా చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ ఇఒ వెంకటేశ్వరరావు ఆయనకు గుర్తు వచ్చినప్పుడు గుడికి రావడం, ఒకేసారి హాజరు పట్టికలో సంతకాలు పెట్టడం చేస్తున్నారన్నారు. గుడి అభివద్ధి కోసం కోసం ఎవరన్నా అడిగితే రైతులు డబ్బులు కట్టడం లేదని తప్పించుకుంటున్నారని తెలిపారు. ఈ అక్రమాలపై ఎండోమెంట్ డిసికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ బిల్లకుర్తి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసిలు రచ్చ ముత్యాలు, నంది కోళ్ల శ్రీదేవి, స్థానిక నాయకులు చిట్టూరి చలపతి, నందికోళ్ల శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.










