
ప్రజాశక్తి-యంత్రాంగం
అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలుచోట్ల శనివారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
మాధవధార : మాధవధార ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రైవేట్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి మూల దీపేష్ ఆధ్వర్యాన అవగాహనా ర్యాలీ నిర్వహించారు. పొగాకుకు దూరంగా ఉండటం, ఆల్కహాల్ను పరిమితం చేయడం, చర్మాన్ని రక్షించుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ప్లకార్డులు పట్టుకుని నినదించారు. ఈ సందర్బంగా మూల దీపేష్ మాట్లాడుతూ, జీవనశైలి మార్పులు, రెగ్యులర్ తనిఖీలు, ముందస్తుగా కేన్సర్ను గుర్తించడం చేస్తే ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కేన్సర్ మరణాలను నివారించవచ్చని తెలిపారు. దీపేష్ తండ్రి మూల వెంకటరావు మాట్లాడుతూ, కరోనా సమయంలో గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులను దీపేష్ పంపిణీచేశారని తెలిపారు.
ఆరిలోవ : వింద్రా సూపర్ స్పెషాలిటీ అండ్ కేన్సర్ రీసెర్చ్ హాస్పిటల్, ముడసర్లోవ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ముడసర్లోవ పార్కు రోడ్డులో కేన్సర్పై అవగాహన కల్పించారు. స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ప్రాంతం నుంచి చినగదిలి సాయిబాబా ఆలయం వరకు వాక్ థాన్ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్ వంశీధర్ పుత్రవేవు, డాక్టర్ సయ్యద్ యాసర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మూర్తి, కార్యదర్శి ఈశ్వరరావు, కోశాధికారి నాయుడు, ఉపాధ్యక్షులు శంకరరావు, బాసస్వామి, రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సింహాచలం: అడవివరం గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ప్రసాద్ పట్నాయక్, భాస్కర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ కేన్సర్పై అవగాహన అవసరమన్నారు. ఈ ర్యాలీలో ఆసుపత్రి వైద్యులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.