Feb 12,2023 23:50

సమావేశంలో మాట్లాడుతున్న బిటి మూర్తి

ప్రజాశక్తి-మాధవధార, కరాస, కంచరపాలెం : కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పింఛన్‌దారులు రోడ్డున పడుతున్నారని ఆల్‌ ఫెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ (ఎపిఅర్‌పిఎ) గౌరవాధ్యక్షులు బిటి.మూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్రా ఆధ్వర్యాన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి తక్కువ పింఛన్‌తో కుటుంబాలను పోషించుకోలేక పింఛన్‌దారులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెరుగుతున్న ధరలతో జీవనం దుర్భరంగా మారుతోందన్నారు. పింఛన్‌ పెంచడంతోపాటు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు మోడీ భరోసా ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా నేటికీ పాత పద్ధతినే అవలంభిస్తున్నారని విమర్శించారు. తక్షణమే పింఛను పెంపుదలతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.
పింఛన్‌దారుల సమస్యలపై ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు మర్రిపాలెంలోని పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాకు పింఛన్‌దారులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి కె.నూకరాజు, కెపి.కుమార్‌, జి.సూర్యప్రకాష్‌, భాస్కరరావు, అప్పలరాజు పాల్గొన్నారు.