Nov 01,2023 20:32

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్‌

ప్రజాశక్తి - ఆదోని
కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగిద్దామని వక్తలు తెలిపారు. బుధవారం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదోనిలోని శ్రీమంగళ ఆంజనేయ స్వామి కల్యాణ మండపంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.షబ్బీర్‌ బాష, పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగరాజు అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యలు అజరు బాబు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, టిడిపి సీనియర్‌ నాయకులు గుడిసె కృష్ణమ్మ, కాంగ్రెస్‌ నాయకులు దేవిశెట్టి ప్రకాష్‌, ఆర్‌సిసి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, జనసేన పార్టీ పట్టణ నాయకులు పులి రాజు, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు చెన్నకేశవులు, సిపియుఎస్‌ఐ జాతీయ కార్యదర్శి కోదండ, ఎపియుడబ్ల్యుజె జిల్లా ఉపాధ్యక్షులు దేవదాస్‌, ఎస్‌టియు డివిజన్‌ అధ్యక్షులు వీర చంద్ర యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయి మాట్లాడారు. కరువు, కాటకాలకు నిలయమైన రాయలసీమ జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా రాయలసీమ జిల్లాల్లో కనీసం 5 వేల మందికి ఉపాధి చూపే ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. యువత ఉద్యోగావకాశాలు పొందాలంటే పరిశ్రమల ఏర్పాటుతోనే సాధ్యమని తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, రాయలసీమ విద్యార్థులు, యువకులు, ప్రజలు కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. లాభాల బాటలో నడుస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు, మాలమహానాడు జిల్లా నాయకులు సాయిరామ్‌, నరేష్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్‌, మండల కార్యదర్శి కల్లుబావి రాజు, వైఎస్‌ఆర్‌ఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి లింగప్ప, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పట్టణ అధ్యక్షులు బెస్త సూర్య, డిఎస్‌ఎఫ్‌ నాయకులు ఉదరు, ఎఐకెఎస్‌ జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రెడ్డి, మాజీ ఎంపిపి మురళీ మాట్లాడుతూ... బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతోందని, దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఈనెల 8న జరిగే విద్యాసంస్థల బంద్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు అఖండ, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, ఎఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ కార్యదర్శి దస్తగిరి, పిడిఎస్‌ఒ జిల్లా కన్వీనర్‌ తిరుమలేష్‌, బిడిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ రమేష్‌, ఎఐఎస్‌ఎ జిల్లా నాయకులు అనిల్‌, ఎఐవైఎఫ్‌ మండల కార్యాదర్శి అంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా, రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు పూనుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ఈ మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. ప్రజా నాట్య మండలి కార్యదర్శి షేక్షావలీ, ఇన్సన్‌ కమిటీ నాయకులు షాషావలీ, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు లక్ష్మీ నారాయణ, వీరేంద్ర, పవన్‌, నరేష్‌, సాయి, కిరణ్‌, కిశోర్‌, యోహాను, నాగరాజు పాల్గొన్నారు.