ప్రజాశక్తి - ఆదోని/కౌతాళం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని టిడిపి ఆదోని ఇన్ఛార్జీ మీనాక్షి నాయుడు, మంత్రాలయం ఇన్ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. గురువారం చంద్రబాబుకు మద్దతుగా ఆదోని ఇన్ఛార్జీ మీనాక్షి నాయుడు నాయకత్వంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఆదోని ఎన్టిఆర్ విగ్రహం నుంచి పాదయాత్ర మొదలైంది. కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం వరకు సాగింది. ముందుగా ఆదోని పట్టణంలోని ఎన్టిఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పాదయాత్రగా కడితోట, గనేకల్లు, పాండవగల్, ఎరిగేరి, కామవరం మీదుగా ఉరుకుందకు చేరుకున్నారు. కడితోట బైపాస్ రోడ్డులో వెలసిన దాదా పీర్ సాహెబ్ దర్గాలో దర్గా పీఠాధిపతి బాషా పీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబును వైసిపి ప్రభుత్వం ఆధారాలు లేని కేసులతో అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. 30 కిలోమీటర్లు పాదయాత్రతో బయల్దేరి ఈరన్న స్వామిని దర్శించుకున్నారు. టిడిపి మంత్రాలయం ఇన్ఛార్జీ తిక్కారెడ్డి, పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో ఎరిగేరి గ్రామం నుంచి పాదయాత్రలో భాగస్వాములయ్యారు. టిడిపి నాయకులు బుద్ధారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజు, క్లస్టర్ ఇన్ఛార్జీ కొట్రేష్ గౌడ్, ఎల్లారెడ్డి, మైనారిటీ సంఘం రాష్ట్ర నాయకులు సాయిబాబా, కురుగోడు, టిప్పు సుల్తాన్, రమేష్ గౌడ్, వెంకటరెడ్డి, శివమూర్తి, ఎరిగేరి బసవరాజు, సురేంద్ర, సిద్ధు, రాజాబాబు, శివప్ప గౌడ్, రంగస్వామి నాయుడు, సాయిబాబా, రామకృష్ణ, వీరేష్ పాల్గొన్నారు.
పాదయాత్రకు స్వాగతం పలికిన తిక్కారెడ్డి










