కబ్జా భూములు కాపాడాలి..
ప్రజాశక్తి - గూడూరు రూరల్ : చిల్లకూరు మండలంలో ఎస్సి ఎస్టీ పేద ప్రజలకు ఇచ్చిన భూములను కొంతమంది పెత్తందారులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని దీనిపై అధికారులు స్పందించడం లేదని గూడూరు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ఎస్సి, ఎస్టి, బిసి మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భూ మాఫియాను అరికట్టాలని నినాదాలు చేశారు. ఫోరం అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర మాట్లాడుతూ చిల్లకూరు మండలం బుదనం గ్రామంలో ఎస్సి ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములలో సాగు చేసుకునే జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. సాగు చేసుకుంటున్నా భూమిని ఆక్రమించిన రవి వర్మపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మండల అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ సభ్యులు విజరు కుమార్, ప్రసాద్, మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










