
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నిర్ణీత సమయానికి కౌలు ఇవ్వకపోవడంతో రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేలో కౌలు ఇస్తున్నట్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచలేదు. 29 గ్రామాల పరిధిలో 22,948 మంది రైతులకు 28,128 ఎకరాల భూమికి రూ.183.17 కోట్లు కౌలు పరిహారం విడుదల చేస్తూ మేలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సిఆర్డిఎ 2015 జనవరి నుంచి డిసెంబరు వరకు భూ సమీకరణ ద్వారా రాజధాని నిర్మాణం నిమిత్తం తీసుకుంది. 2016 నుంచి కౌలు చెల్లింపులు ప్రారంభించింది. వార్షిక కౌలు అందచేయడంలో గత మూడేళ్లుగా తీవ్ర జాప్యం జరుగుతోంది.
2016 నుంచి 2019 వరకు ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి మే చివరి లోగా వార్షిక కౌలు సొమ్ము రైతుల ఖాతాల్లో జమయ్యేది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ప్రతి ఏటా జూన్ నుంచి ఆగస్టులోగా జమ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది మేలోనే ఉత్తర్వులు ఇచ్చినా ఇంత వరకు రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు జమకాలేదు. అయితే ఎవరైతే తమకు కౌలు సొమ్ము రాలేదని కోర్టును ఆశ్రయిస్తారో వారికి మాత్రమే కౌలు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో మొత్తం రైతుల తరుఫున ఇటీవల హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను దసరా తరువాత విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది. ఈలోగా సిఆర్డిఎ అధికారులను కౌంటర్దాఖలు చేయాలని కోరింది.
సిఆర్డిఎకు భూములు అప్పగించిన రైతులకు 10 ఏళ్లపాటు ఏటా 10 శాతం పెంచేలా అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు సాయం ప్రకటించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేలు కౌలు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మొత్తంపై ప్రతిఏటా 10 శాతం సొమ్ము పెంచి రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుంది. 2021 నుంచి ప్రతి ఏటా కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన తరువాతనే రైతులకు కౌలుసాయం అందిస్తున్నారు. రెండేళ్లుగా అసైన్డ్ రైతులకు కూడా కౌలు పరిహారం నిలిచిపోయింది.
29 గ్రామాల్లో 3 వేల మంది అసైన్డ్ రైతులు ఉన్నారు. వీరి భూములు కూడా రాజధానికి తీసుకున్నారు. అయితే అసైన్డ్ భూముల అప్పగింతలో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు పెండింగ్లో ఉండటం వల్ల అసైన్డ్ రైతులకు కౌలు పరిహారం నిలిపివేశారు. వీరి తరుఫున సిపిఎం ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం కౌలు సొమ్ము సిఎఫ్ఎంఎస్కు పంపినా బ్యాంకు ఖాతాలకు జమకావడంలో జాప్యంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తోందని, తమను నిర్లక్ష్యం చేస్తుందని రాజధాని రైతులు శుక్రవారం తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మునిసిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.