ప్రజాశక్తి -పిఎం.పాలెం : వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెపుతూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 7పై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పిఎంపాలెంలో థ్యాంక్యూ సిఎం సార్ అంటూ వాల్పోస్టర్లను ప్రదర్శించిన యూనియన్ ప్రతినిధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదనను అర్ధం చేసుకున్న ప్రభుత్వం, సిఎం జగన్, సర్వీస్ రెగ్యులరైజేషన్తోపాటు ప్రొబేషన్ కాలంలోనూ ఉన్న ఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఒరికి కారుణ్య నియామాకాల ద్వారా ఉద్యోగావకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్ సుతేజ్, జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ అనిల్ మరియు ప్రధాన కార్యదర్శి నారాయణరావు పట్టు వదలకుండా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకువెళ్లారని, ఈ నెల 20న సిఎం జగన్ మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడం ద్వారా సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునేలా కృషి చేశారన్నారు.










