ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: అనుకోని విపత్తులతో, అనారోగ్య కారణాలతో చనిపోయిన తోటి ఉద్యోగుల కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు సకాలంలో కారుణ్య నియామకాల ద్వారా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని, అందులో భాగంగానే సకాలంలో కారుణ్య నియామకాలు ఇస్తున్నామని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ఈ మేరకు జెడ్పిలో నలుగురికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ కోవిడ్తో, ఇతర కారణాలతో మృతి చెందిన 180 మంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ఆర్టిసి, సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను కల్పించినట్టు వివరించారు. కార్యక్రమంలో జెసి ఎం.నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఒ మురళీకృష్ణ, డిఆర్డిఎ పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు.
బాధితులకు నష్టపరిహారం...
ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద ఈ ఏడాది జూన్ 2న జరిగిన మూడు రైళ్లు ఢకొీన్న ఘటనలో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అందజేశారు. నాటి రైలు ప్రమాదంలో సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన చోడిపల్లి గురుమూర్తి మృతి చెందగా, అదే మండలం ఎం.కొత్తూరుకు చెందిన కె.పూజ, పోలాకి మండలం కొత్తరేవుకు చెందిన తాయి అను గాయపడ్డాడు. మృతుడు గురుమూర్తి కుటుంబానికి రూ.పది లక్షలు గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు. జెసి, ట్రైనీ కలెక్టర్, డిఆరఒ, కలెక్టరేట్ ఎఒ రాజేశ్వరరావు పాల్గొన్నారు.










