Sep 13,2023 22:39

కార్మిక శాఖ అధికారికి వినతిని ఇస్తున్న సిఐటియు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి-హిందూపురం: హిందూపురం రూరల్‌ మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని గురునానక్‌ పరిశ్రమ కార్మికులకు పరిశ్రమ యాజమాన్యం న్యాయం చేయక పోతే పారిశ్రామిక వాడను స్తంభింపజేస్తామని సిఐటియు నాయకులు రాము, ఎఐటియుసి వినోద్‌ కుమార్‌, ఒపిడిఆర్‌ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి అన్నారు. గురునానక్‌ కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తు చేస్తున్న ఆందోళనలు బుధవారానికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు వారు బుధవారం పట్టణంలోని కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఎఎల్‌ఒ రమణ రెడ్డికి వినతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నౌషాద్‌, ముత్యాలప్ప, సురేష్‌, కమల్‌ భాష, ఈరప్ప, బషీర్‌, దాదాపీర్‌, హనీఫ్‌తో పాటు గురునానక్‌ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు చాంద్‌బాషా, రమేష్‌, శ్రీనివాసులు, సతీష్‌, కార్మికులు పాల్గొన్నారు.