ప్రజాశక్తి-మాధవధార : కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మాధవధార రైల్వే కార్మిక సంక్షేమ సంఘం పనిచేస్తోందని 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ అన్నారు. రైల్వే కార్మికులు ఉద్యోగ బాధ్యత నిర్వహించడంతో పాటు రైల్వే అభ్యున్నతికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. మాధవధార భరద్వాజ క్షేత్రంలో రైల్వే కార్మిక సంక్షేమ సంఘం 39వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వావిలపల్లి ప్రసాద్ మాట్లాడుతూ, 39 ఏళ్ల కిందట చిన్న సంఘంగా ఏర్పడి కార్మికుల సంక్షేమానికి పనిచేస్తుందన్నారు. శ్రీ మాధవ యువజన సమాజం కన్వీనర్ సనపల రామ్గోపాల్రావు మాట్లాడుతూ, భారతదేశంలో అతిపెద్ద సంస్థగా ఉన్న రైల్వేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముక్కలుగా చేస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాధవధార రైల్వే కార్మిక సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు పప్పల రామచంద్రరావు, అధ్యక్షులు వావిలపల్లి వెంకటరావు, ఎపి వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు కంచరాన సూర్యనారాయణ, గాయత్రి విద్యా మందిర్ కరస్పాండెంట్ సనపల జగదీశ్వరరావు, సనపల శంకరరావు, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పప్పల రామ్మోహన్రావు, అన్నపు ఈశ్వరరావు, పేడాడ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల రైల్వేలో ఉద్యోగ విరమణచేసిన పేడాడ నరసింగరావు, సనపల సత్యనారాయణ దంపతులను ఘనంగా సన్మానించారు.
నూతన కమిటీ ఎన్నిక
మాధవధార రైల్వే కార్మిక సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా పప్పల రామచంద్రరావు, అధ్యక్షులుగా వావిలపల్లి వెంకటరావు, ఉపాధ్యక్షునిగా మూల అప్పారావు, కార్యదర్శిగా రామ్కుమార్, సహాయ కార్యదర్శిగా రమణ, కోశాధికారిగా పైడి రాము, కమిటీ సభ్యులుగా సనపల సీతారామకృష్ణ, కొమ్మనాపల్లి గోవిందా, పివిఎస్.కుమార్, సనపల జగదీష్, బొడ్డేపల్లి ప్రసాద్ ఎన్నికయ్యారు.










