ప్రజాశక్తి - దేవనకొండ
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్న మోడీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని నాయకులు హెచ్చరించారు. బుధవారం 'క్విట్ కార్పొరేట్', 'సేవ్ ఇండియా'లో భాగంగా కార్మిక, రైతు, వ్యకాస పిలుపు మేరకు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టి, అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి అశోక్, రైతుసంఘం మండల కార్యదర్శి సూరి, సీనియర్ నాయకులు శ్రీరాములు మాట్లాడారు. 1942లో దేశవ్యాప్తంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకోవాలని కోరారు. మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఉద్యోగ, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వేసంస్థలను ప్రయివేట్కు అప్పజెప్పడాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. హమాలి, భవన, ఆటో కార్మికులకు సమగ్ర చట్టం చేయడం లేదని తెలిపారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందని, అందరూ పాల్గొనాలని కోరారు. రైతు, కార్మికులు, కూలీలు, ప్రజల డిమాండ్లను తహశీల్దార్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవ్వాల్సిన వినతిపత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నించగా 'నేను సమావేశంలో ఉన్నాను. కుదరదు. సమావేశం తర్వాత తీసుకుంటాను' అని తహశీల్దార్ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వినతిపత్రాన్ని తహశీల్దార్ కార్యాలయం తలుపులకు అతికించారు. ప్రజాసంఘాల నాయకులు ఓంకార్, రంగన్న, రాముడు, సామాజిక ఉద్యమ నాయకులు బంగి రంగన్న, రైతు నాయకులు పల్లెదొడ్డి రామాంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మండల కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా ర్యాలీగా బయల్దేరి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎఐటియుసి నాయకులు రంగన్న, సిఐటియు నాయకులు రాముడు, ఐఎఫ్టియు నాయకులు ప్రసాద్ అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా నాయకులు గోవిందు, సిపిఐ నాయకులు పంపన గౌడు, సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు రాజు, రైతు సంఘం చిన్నన్న, కెసి.జబ్బర్, ఖాజా, ఏసోబు, రోషన్, మల్లికార్జున, రవి పాల్గొన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాల్ అధ్యక్షత వహించారు. ఐఎన్టియుసి నాయకులు దేవిశెట్టి ప్రకాష్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి అజరు బాబు, సిఐటియు జిల్లా నాయకులు మహానంద రెడ్డి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎంకప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మిరెడ్డి, వ్యకాస జిల్లా నాయకులు కె.లింగన్న, ఐఎఫ్టియు రైతు సంఘం నాయకులు మల్లికార్జున, మహిళా సంఘం నాయకులు మణి మాట్లాడారు. సిఐటియు నాయకులు తిప్పన, వీరారెడ్డి, ఎఐటియుసి ఎంకప్ప, ప్రకాష్ ఉన్నారు. ఆస్పరి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘాల నాయకులు హనుమంతు, బాలకృష్ణ, రంగస్వామి, రామాంజినేయులు, రైతుసంఘం నాయకులు ఈరన్న, సత్యన్న, వ్యకాస నాయకులు రామాంజినేయులు పాల్గొన్నారు. కౌతాళంలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆర్ఐ రాజశేఖర్కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్లయ్య, రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు జగదీష్, రైతు సంఘం నాయకులు హనుమంతు, ఉలిగయ్య, సత్యప్ప, వలీ, మారయ్య, రైతు కూలీ సంఘం నాయకులు రత్నయ్య, వెంకోబ పాల్గొన్నారు.










