ప్రజాశక్తి -మధురవాడ : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లోకార్మికులు తగిన బుద్ధి చెబుతారని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. మధురవాడ జోన్ మహాసభలను ద్రోణంరాజు కల్యాణ మండపం వద్ద ఆదివారం నిర్వహించారు. భవన నిర్మాణ సంఘం నాయకులుగా పనిచేసి ఈ మహాసభ కాలంలో మరణించిన పిళ్లా రాము చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కెఎస్వి కుమార్, ఉపాధ్యక్షులు కుమార మంగళం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కాలంలో మరణించిన నాయకులకు మహాసభలో శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మహాసభలో ముఖ్య అతిథులు కుమార మంగళం, ఆర్కెఎస్వి.కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి కార్మిక చట్టాలను మార్పుచేసి యాజమానులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమే అన్నారు. నరేంద్రమోడీ అడుగులకు మడుగులు ఒత్తుతూ రాష్ట్ర ప్రజలను, కార్మికులను జగన్మోహన్రెడ్డి కడగండ్ల పాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు, కార్మికులు, కర్షకులు ఇక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిజాయతీ, క్రమశిక్షణ గల సిఐటియులో చేరాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం జోన్ ప్రధాన కార్యదర్శి పి.రాజ్కుమార్ మహాసభ నివేదిక ప్రవేశపెట్టారు. చర్చలు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకొని ముందుకు సాగాలని డి.అప్పలరాజు, జి.మంగశ్రీ, పి.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన మహాసభ నిర్ణయం తీసుకుంది.
నూతన కమిటీ
నూతన కమిటీ అధ్యక్షులుగా డి.కొండమ్మ, ప్రధాన కార్యదర్శిగా పి.రాజ్కుమార్, ఉపాధ్యక్షులుగా జి.మంగశ్రీ, డి.అప్పలరాజు, పి.రాజశేఖర్, కార్యదర్శులుగా సిహెచ్ శేషుబాబు, జిన్నారం, ఎం.కనకరత్నం, కోశాధికారిగా అంపోలు భాస్కరరావు, కమిటీ సభ్యులుగా ఎస్.రామప్పడు, టి.రమేష్బాబు, జి.విజరు, యు.కుమారి, బి.లక్ష్మి, పి.వరలక్ష్మి, కె.ఈశ్వరరావు, యు.శాంతి, జి.కిరణ్, గణేష్ తదితరులను ఎన్నుకున్నారు.










