ప్రజాశక్తి కర్నూలు హాస్పిటల్ : కార్మిక సంఘాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. కర్నూలు మౌర్య ఇన్ లోని పరిణయ ఫంక్షన్ హాల్ లో టిఎన్టియుసి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తమకు తెలియజేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తే పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చిస్తానన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఆర్టీసీ, ఆటో, ఉద్యోగస్తులు, ప్రెస్, సిఐటియు, మున్సిపల్, ప్లంబర్స్, మత్స్యకారులు, తదితర కార్మిక సంఘాలు టిఎన్టియుసి కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు నరసింహులు, అజీజ్, సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అంజిబాబు, నాయకులు సిహెచ్.సాయిబాబా, ఆందజనేయులు(విజరు) ఇతర సంఘాల నాయకులు అశోక్, ప్రభాకర్, రామకృష్ణ, శ్రీనివాసులు, మోహన్ రావ్ పాల్గొన్నారు.










