ముగిసిన సిఐటియు జిల్లా మహాసభ
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా లింగరాజు, ప్రసాద్ ఎన్నిక
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
జిల్లాలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని పలువురు నేతలు ఉద్ఘాటించారు. సిఐటియు జిల్లా 12వ మహాసభ ఆఖరి రోజు సోమవారం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శిగా డిఎన్విడి.ప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితోపాటుగా మరో 16 మందితో ఆఫీస్ బేరర్స్, 61 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగరాజు, ప్రసాద్ మాట్లాడుతూ ఏలూరులో నిర్వహించిన సిఐటియు జిల్లా మహాసభ మూడు రోజులు పాటు జయప్రదంగా ముగిశాయని తెలిపారు. ఈ మహాసభకు అనేక రూపాల్లో సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా మహాసభ స్ఫూర్తితో రానున్న కాలంలో జిల్లాలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు రూపొందిస్తామని చెప్పారు. అలాగే కోశాధికారిగా ఐవి.సుధాకర్, ఆఫీస్ బేరర్స్గా బి.సోమయ్య, పి.భారతి, కె.విజయలక్ష్మి, ఎన్.రమణరావు, ఎస్.రాంబాబు, అర్విఎస్.నారాయణ, కెవిఎన్ఎస్.ప్రసాద్, జి.రాజు, ఎం.నాగమణి, ఎం.దుర్గారావు, వివివిఎన్.ప్రసాద్, కె.వెంకట్రావు, కె.సుభాషిణి, వి.సాయిబాబు, సాయి కిరణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
తీర్మానాలు ఇవే..
-రవాణా రంగంలో కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.
-జిఒ 21ను రద్దు చేయాలి.
-స్థానికంగా ఆటో స్టాండ్లు కేటాయించాలి.
-స్కీం వర్కర్లుకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
-రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి.
-హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి.
-ఏలూరు జ్యూట్ మిల్ తెరిపించాలి. లేని పక్షంలో కార్మికుల చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలి.
-మునిసిపల్, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
-భవన నిర్మాణరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. వెల్ఫేర్ బోర్డు నిధులు విడుదల చేయాలి. క్లెయిములు పరిష్కరించాలి.
-ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. వారికి కనీస వేతనం ఇవ్వాలి.
-సిపిఎస్ విధానం రద్దు చేయాలి.










