
సిఐటియు ఉమ్మడి విశాఖ జిల్లా పూర్వ కార్యదర్శి ఎస్.రమేష్ వర్థంతి కార్యక్రమాలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మంగళవారం జరిగాయి. రమేష్ చిత్రపటాలకు ఆయా చోట్ల నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఆయన చేసిన కార్మిక పోరాటాలను స్మరించుకున్నారు.
ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్
కార్మిక సమస్యలపై నిరంతరం కృషి చేసి తన జీవితాన్నే అంకితం చేసిన కార్మిక పక్షపాతి ఎస్.రమేష్ అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు కొనియాడారు. సిఐటియు ఉమ్మడి విశాఖ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి రమేష్ ఆరో వర్థంతి సభ జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో మంగళవారం జరిగింది. సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నర్సింగరావు మాట్లాడుతూ నవంబర్ 7 రష్యా అక్టోబర్ విప్లవ దినమని, రష్యాలో కార్మిక రాజ్యం కోసం పోరాడి సాధించుకున్న రోజని అన్నారు. కమ్యూనిస్ట్ సమాజంలో అసమానతలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. పేదలకు భూమి పంపిణీ, శాశ్వత ఉపాధి, ప్రభుత్వరంగాన్ని స్థాపించడం, ఉచిత విద్య, వైద్యం అందుబాటులో ఉంచడం వంటివి కమ్యూనిస్టుల పాలనలో చూసి, అటువంటి సమాజం భారతదేశంలో రావాలని దృఢ సంకల్పంతో పనిచేసిన నాయకుడు రమేష్ అని తెలిపారు. పదేళ్ల వయస్సులో నాటకాలు వేసి ప్రజానాట్య మండలి ద్వారా అనేక ప్రజా కళలను ప్రదర్శించారన్నారు. తను చదువుకున్న కృష్ణా కాలేజీలో ఎస్ఎఫ్ఐని పెట్టి కాలేజ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారన్నారు. తరువాత చిట్టివలస జ్యుట్ మిల్లు, గంగవరం పోర్టు కార్మికులు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. 2017లో కేన్సర్తో అకాల మరణం పొందారని తెలిపారు. నేడు బిజెపి, వైసిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. అందుకు నవంబర్ 15న విజయవాడలో సిపిఎం చేపట్టే ప్రజా రక్షణ భేరి కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ సర్జికల్ రఘు, 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, నాయకులు జివిఎన్.చలపతి, వై.రాజు, ఎం.సుబ్బారావు, శాస్త్రి, బి.జగన్, యుఎస్ఎన్.రాజు, జి.పోలేశ్వరరావు, కెవిపి.చంద్రమౌళి, కె.కుమారి పాల్గొన్నారు.
అనకాపల్లి : సిఐటియు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఎం నేత ఎస్.రమేష్ 6వ వర్థంతి సందర్భంగా స్థానిక కార్మిక, కర్షక నిలయంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ముందుగా రమేష్ చిత్ర పటానికి సిపిఎం సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ పూలమాలవేసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రమేష్ చిన్నతనం నుండే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, విద్యార్థి, కార్మిక, ప్రజానాయకుడిగా అనేక పోరాటాల నిర్వహించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు అర్.శంకరరావు, నాయకులు ఈశ్వరరావు, శివాజీ, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో.....
ఎస్.రమేష్ ఆరవ వర్థంతి అనకాపల్లి పార్సిల్ కలాసీల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. రమేష్ చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడమే రమేష్కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకర్రావు, ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బాడీ రాజు, కె రాజు, సన్యాసిరావు పాల్గొన్నారు.
చోడవరం : స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్.రమేష్ చిత్ర పటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరు వరలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎస్.అమ్మాజీ, మణి, సత్యవతి, ఆర్.బుచ్చి రాజమ్మ, పార్వతి, హసీనా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ చంద్రశేఖర్, నాయకులు ఆర్.దేముడునాయుడు, చంద్రరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని చౌడువాడ పిహెచ్సి వద్ద ఆశా వర్కర్లు రమేష్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, ప్రజా సంఘాల మండల కన్వీనర్ ఎర్ర దేవుడు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ మండల కేంద్రంలో రమేష్ చిత్రపటానికి ఆశా వర్కర్లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రమేష్ మంచి పోరాట నాయకుడే కాకుండా మంచి కళాకారుడని, పరవాడ మండలం లంకెలపాలెంలో గంగిరెడ్ల కళాకారులను చైతన్యవంతం చేసి వారితో సంక్రాంతి సంబరాలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అల్లు రాజు, వెన్నెల లక్ష్మి, సన్యాసమ్మ, అక్కులమ్మ, ఐద్వా నాయకులు పి.మాణిక్యం పాల్గొన్నారు.
రాంబిల్లి : మండలంలో దిమిలి గ్రామంలో ఎస్.రమేష్ 6వ వర్ధంతి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.దేముడు నాయుడు, ఆశా కార్యకర్తలు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఆర్.రమ్య, ఎ.రామలక్ష్మి, డి.ధనలక్ష్మి, టి.కనకమహాలక్ష్మి, వై.లక్ష్మి, పి.రామలక్ష్మి, ఎన్. చిట్టమ్మ పాల్గొన్నారు.
కశింకోట : ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కశింకోటలో ఎస్.రమేష్ చిత్ర పటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దాకరపు శ్రీనివాసరావు, ఐద్వా నాయకులు డిడి వరలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తనూజా, ఎన్పిఆర్డి నాయకులు ఎస్కె.రెహమాన్, అశా కార్యకర్తలు పాల్గొన్నారు
సబ్బవరం : మండల కేంద్రంలో ఎస్.రమేష్ చిత్ర పటానికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, అంగన్వాడీ సంఘం నాయకులు వివి.రమణమ్మ, ఆశా కార్యకర్తల సంఘం నాయకులు భవాని, దేముడమ్మ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : ఎస్.రమేష్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.రాము పిలుపునిచ్చారు. మండలంలోని అచ్చుతాపురం, హరిపాలెం గ్రామాల్లో రమేష్కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.సోమునాయుడు, జి .సత్తిబాబు, కె.సింహాద్రి ఐద్వా నాయకులు ఆర్.లక్ష్మి సరోజినీ, మంగమ్మ, సూరిలక్ష్మి, విజయ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : మండలంలోని వేములపూడి గ్రామంలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక నేత ఎస్.రమేష్ 6వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు కె.ప్రసన్న, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జి.గీతాకృష్ణ, ఆశా పిహెచ్సి అమ్మాజీలు రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కె.ప్రసన్న మాట్లాడుతూ రమేష్ జీవితమంతా ప్రజల కోసం పోరాడారన్నారు.