
ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని డౌనూరు గ్రామ పంచాయితీ పరిధిలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కు డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, వైసిపి ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అరుకు కాఫీకి ప్రపంచంలో మంచి డిమాండ్ ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన 20 దేశాల సదస్సులో ప్రధానమంత్రి అరకు కాఫీని బహుమతిగా ఇచ్చారని తెలిపారు. గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. జిసిసి ద్వారా కాఫీ హౌసింగ్ చేయటానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. రూ.500 కోట్లతో జిసిసి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరు నెలల్లో యూనిట్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ బెంగళూరులో కాఫీ ప్రొసీసింగ్ జరుగుతున్నట్లుగా డౌనూరులో కాఫీ రైసింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు కాఫీ రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, ఐటిడిఎ పిఓ అభిషేక్, జిసిసి చైర్పర్సన్ శోభా స్వాతీరాణి, ఎమ్డి సురేష్ కుమార్, జెడ్పిటిసి వారా నూకరాజు, ఎంపిటిసి అప్పారావు, సర్పంచ్ భవాని, ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, పోతురాజు, నీలపు సూరిబాబు, సురేష్ పట్నాయక్, పెట్ల గాంధీ, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.