
మదనపల్లె అర్బన్ : దేశవ్యాప్తంగా బిసి కుల జనగణన జరగడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిందని ఆ పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షులు ఎస్.రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో 1931లో బిసి కుల జనగణన చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు జనాభాలో 50 శాతం కలిగిన బిసి కుల జనగణన జరగలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బిసి అభివద్ధి, కుల గణనపై చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా నాలుగు రాష్ట్రాలలో అమలుకు తీర్మానం చేశారని, వాటిలో మూడు రాష్ట్రాలలో ముగ్గురు సిఎంలు, బిసిలు ఉన్నారని వివరించారు. బిజెపి 10 రాష్ట్రాలలో అధికారంలో ఉంటే కేవలం ఒక్కరు మాత్రమే బిసి ముఖ్యమంత్రి ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనాకుమారి, వై.సురేంద్రరెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫి, ఎల్.చలపతి, డాక్టర్ ఎస్.కె.బాషా, మహమ్మద్ అలీ, పాలేటి, ఆర్.నాగరాజు పాల్గొన్నారు.