ప్రజాశక్తి-కొల్లూరు: రానున్న ఖరీఫ్ సీజన్కు కాలువల్లో పూడికలు తీయించి సిద్ధం చేయించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. కొల్లూరు ఎంపీడీవో ఆఫీసులో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అర్జున్రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కాలువలలో పూడికలను గుర్తించి వాటిని తీసి వచ్చే సీజన్కు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పనులపై శ్రద్ధ పెట్టి కొత్త పనులను గుర్తించాలన్నారు. వచ్చేది వేసవికాలం కాబట్టి కరెంటు కోతలు, నీటి సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు. తాను గడప గడపకూ జగనన్న కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎక్కువమంది సొంత ఇళ్ల స్థలాలు ఉన్నవారు ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పారని, అందువలన హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కొత్తగా ఇల్లు కట్టుకునే వారి అప్లికేషన్లు తీసుకోవాలని ఆయన చెప్పారు. తనకు తెలియకుండా హైస్కూల్లో వాచ్మెన్లను నియమించకూడదని అన్నారు.










