ప్రజాశక్తి - ఏలూరు టౌన్
జాతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు అమలు పరచి మేకల కబేల నిర్వహణకు తగు చర్యలు తీసుకున్నామని నగర కమిషనర్ షేక్ షాహిద్ తెలిపారు. స్థానిక తొమ్మిదో డివిజన్లోని మేకల కబేలా సముదాయాన్ని అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 15వ సంఘం ఆర్థిక నిధులతో కబేల అభివృద్ధి ఆధునికీకరణ పనులు చేపట్టామన్నారు. మేకల కబేలా చుట్టూ ఆక్రమణలు తొలగించి, సరిహద్దులు గుర్తించి రక్షణ గోడ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య వాతావరణం కల్పించేలా కబేల సముదాయాన్ని పరిశుభ్రపరచాలని హెల్త్ అధికారికి, అసోసియేషన్ వర్తక సంఘం సభ్యులకు కమిషనర్ షాహిద్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఇ వెంకటేశ్వరరావు, హెల్త్ అధికారి గోపాల్ నాయక్, ఎంఇ భాస్కరరావు, డిఇ తాతబాబు, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగం సిబ్బంది, కబేల అసోసియేషన్ వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.










