- ఎపి వెలుగు ఉద్యోగుల సంఘం డిమాండ్
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
విఓఎల ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాలపరిమితి సర్యూలర్ ను వెంటనే రద్దుచేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఎపి. వెలుగు విఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విఓఎల 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ వెంటనే రద్దుచేయాలని, సి.బి.ఓ. హెచ్.ఆర్ పాలసి అమలు చెయ్యాలని,గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, విఓఎల మెర్జ్ ఆపాలని, పెండింగ్ లో ఉన్న అన్నిరకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి. వెలుగు విఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముద్ద బోయిన రజిని, ప్రధాన కార్యదర్శి ఎం రజిని, మాట్లాడుతూ సంఘాలను విడగొట్టడం కలపడం లాంటి పనులు సెర్ఫ్ అధికారులే చేశారని, విఓల మెర్జ్చేయటం వలన వేలాది మంది విఓలకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మానవ వనరులకు విఘాతం కలిగించటమేనన్నారు. విఓఏల ఉపాధికి నష్టం లేకుండా విఓల మెర్జ్ ను ఆపి, ఎక్కువ సంఘాలున్న విఓల నుండి తక్కువ సంఘాలున్న విఓలకి సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 15 సంఘాల లోపు ఉన్న విఓల, విఓఎ లకు వేతనాలు చెల్లించలేదని కానీ విఓల మెర్జ్ మాత్రం చేసేసరాన్నారు. దీని వల్ల ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కేవీ గోపాల్ రావు, టి చంద్రపాల్ లు సంఘీ భావం తెలిపిన ఈ ధర్నా లో పెనమలూరు మండల అధ్యక్షురాలు జే ఝాన్సీ, గరికపాటి పార్థు శివ సాయి, పి భూలక్ష్మి, కరుణ పాల్గొన్నారు.










