ప్రజాశక్తి-సాలూరు రూరల్ : జీగిరాం జ్యూట్ మిల్లును తెరవాలని కార్మికులు చేపడుతున్న దీక్షలకు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి టెక్కలి ధర్మారావు మద్దతు తెలిపారు. జ్యూట్మిల్లు వద్ద జెఎసి ఆధ్వర్యాన దీక్షలు శనివారం ఐదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఏకైక జ్యూట్మిల్లు ఇదేనని, అనేక మంది ఉపాధి పొందేవారని తెలిపారు. మిల్లు మూతపడటంతో వారంతా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జ్యూట్మిల్లు తెరచి, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదోరోజు దీక్షలలో కొల్లి గోపమ్మ, వై.కొండమ్మ, బేత తౌడమ్మ, ఎం.సత్యవతి, భవాని కూర్చున్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, పట్టణ కార్యదర్శి టి.వెంకటరావు, జెఎసి నాయకులు సూరప్పలనాయుడు, సూర్యనారాయణ, సత్యనారాయణ, శ్రీనివాసరావు, గంగరాజు, సింహాచలం పాల్గొన్నారు.










