ప్రజాశక్తి-ఏలేశ్వరం నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్రలో భాగంగా ప్రతిపాడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి పిజి వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు తిరుగమన దిశలో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. జిఒ 77వల్ల పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోల్పోయారన్నారు. జిఒ నెంబర్ 107, 108 ద్వారా వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, వసతి గృహాలకు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.










