
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లా సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు. శిక్షణలో ఉన్న హౌస్ సర్జన్ డాక్టర్ పి.సువర్ణ రాజు సోమవారం రాత్రి ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తున్న సమయంలో రోగులకు సంబంధించిన సహాయకులు ఎక్కువమంది ఉండడంతో డాక్టర్ సువర్ణ రాజు బయటకు వెళ్లాల్సిందిగా అక్కడ ఉన్న రోగుల సహాయకులకు సూచించారు. దీంతో ఓ రోగికి సంబంధించిన సహాయకుడు డాక్టర్ రాజుపై భౌతికంగా దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో డాక్టర్ రాజు కంటిపై గాయమైంది. ఈ దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు మంగళవారం ఉదయం జిల్లా సరోజన ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.