ప్రజాశక్తి - ఆదోని
కంటి జబ్బులతో బాధపడే వారికి చికిత్స అందించేందుకు జూన్ 3న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనాథ్ గుప్త, మిర్యాల శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని ఎస్కెడి కాలనీలో శిబిరానికి సంబంధించిన కరపత్రాలను సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్, ఈరన్న శెట్టి, రంగనాయకులు, మహిళా విభాగ్ ప్రెసిడెంట్ సంగీత, సెక్రటరీ మమత, ట్రెజరర్ బిందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో జూన్ 3న కంటి చికిత్స వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్, భోజన వసతి, రవాణా సౌకర్యం, అద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నామన్నారు. కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రి వైద్యులు సురేష్ కుమార్, వైద్య బృందం ఆధ్వర్యంలో రోగులకు కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తారని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ పరీక్ష చేస్తారన్నారు. కంటిచూపు సమస్య ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కరపత్రాలు విడుదల చేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు










