
ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల ఆధ్వర్యాన ఈ నెల 2 నుంచి ప్రారంభమైన 69వ వన్యప్రాణి వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు వారోత్సవాల్లో భాగంగా విశాఖ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్ సహకారంతో ఆదివారం తెల్లవారు జామున వైజాగ్ హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు వివిధ విభాగాలలో సుమారు 600 మంది ఈ మారథాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూ పార్కులో ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమంలో జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత విధిగా తీసుకోవాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె బహుమతులు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎఫ్ మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భారతి, జూ ఎడ్యుకేషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.