Feb 16,2023 00:14

పోటీలను ప్రారంభిస్తున్న లాల్‌ కృష్ణ

ప్రజాశక్తి-పరవాడ
మండలంలోని ఫార్మాసిటీ క్రీడా మైదానంలో పరవాడ జర్నలిస్ట్స్‌ స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఫార్మా సిటీ, రాంకీ ఫౌండేషన్‌ సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేసిన రొంగలి కారు నాయుడు మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఫార్మాసిటీ ఎమ్‌డి డాక్టర్‌ పిపి.లాల్‌కృష్ణ బుధవారం ప్రారంభించారు. ముందుగా సీనియర్‌ జర్నలిస్టు కారు నాయుడు, జేసాప్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సోడిశెట్టి దుర్గారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారదులుగా ఉంటూ నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులు నిత్యం ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారని తెలిపారు. జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణకు ఏదో ఒక క్రీడను అలవాటుగా చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జర్నలిస్టు క్రీడలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ డీజీఎం గిరిధర్‌ భక్షి, లైజనింగ్‌ ఏజీఎం రాఘవరెడ్డి, రాంకీ ఫౌండేషన్‌ డిప్యూటీ హెడ్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, పరవాడ జర్నలిస్ట్స్‌ స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.లోకేష్‌, ఎండి.రాజు, జేశాప్‌ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు, అనకాపల్లి, పరవాడ, పెందుర్తి, గాజువాక, గాజువాక జేశాప్‌, వైజాగ్‌ వెబ్‌ వారియర్స్‌, వెబ్‌ టైగర్స్‌ చెందిన క్రికెట్‌ జట్ల సభ్యులు, పరవాడ ప్రెస్‌ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
కారు నాయుడు కుటుంబానికి ఆర్థిక సాయం
కీర్తిశేషులు రొంగలి కారు నాయుడు కుటుంబానికి వసుధ, రక్షిత్‌ డ్రగ్స్‌, విష్ణు కెమికల్స్‌ తదితర ఫార్మా ప్రతినిధులు ఆర్థిక సహాయం అందించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు దొర, కమలాకర్‌, హర్షవర్మ కారు నాయుడు సతీమణి విజయ లక్ష్మికి నగదును అందజేశారు.