Sep 15,2023 21:42

పార్వతీపురంలో దీక్ష చేస్తున్న టిడిపి నాయకులు

పార్వతీపురంరూరల్‌: జనసేన, టిడిపి పొత్తుతో రాష్ట్రంలో వైసిపి చిత్తు చిత్తవుతుందని ఆ పార్టీల నాయకులు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన దీక్షలు శుక్రవారం స్థానిక మెయిన్‌ రోడ్డులో కొనసాగాయి. జనసేన నాయకులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనపై విసిగి వేసారి పోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన టిడిపి పొత్తు... వైసిపిని చిత్తుచిత్తుగా ఓడిస్తుందన్నారు. కొందరు వైసిపి నాయకులు, మంత్రులు నోరు పారేసుకుంటున్నారని,నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. వైసిపి నాయకులకు, మంత్రులకు జనసేన, టిడిపి కలవడంతో వారికి నిద్ర పట్టడం లేదని, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు జి.రవికుమార్‌, కౌన్సిలర్లు తాతపూడి వెంకట్రావు, బడే గౌరీ నాయుడు, కోలా సరితా, మధుసూదన్‌ రావు, నాయకులు కోల వెంకట్రావు, జగన్‌, రవికుమార్‌, పాలకొండ రాజశేఖర్‌, శంకర్రావు, జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్‌, పైల శ్రీనివాసరావు, పసుపురెడ్డి ప్రసాద్‌ తదితరులు విలేకరులతో పాల్గొన్నారు. పాచిపెంట : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పి భంజ్‌దేవ్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పాచిపెంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మంచాల పారమ్మ, సర్పంచ్‌ పాచిపెంట సంతోషి, గొర్ల సత్యం, కొత్తల పోలినాయుడు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు
టిడిపి యువనేత వీరేష్‌ చంద్ర దేవ్‌ ప్రత్యేక పూజలు
కురుపాం : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండి జైలు నుండి విడుదల కావాలని కురుపాం నియోజకవర్గ టిడిపి యువ నేత వైరచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ స్థానిక పైడిమారమ్మ తల్లికి 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు .కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలిజిపేట : నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చాలా అప్రజా స్వామికి మని, ఆయన్ను విడుదల చేసేంత వరకు పోరాటం ఆగేది లేదని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయ చంద్ర అన్నారు. టిడిపి మండల అధ్యక్షులు పెంకి వేణుగోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బలిజిపేటలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరా దీక్షకు అధిక సంఖ్యలో మహిళలు, టిడిపి కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి పెంకి పార్వతి, టిడిపి సీనియర్‌ నాయకులు పెంకి రామ్మోహనరావు, గొట్టాపు వెంకటనాయుడు, బర్నాల సీతారాం, ఎం.అప్పారావు, జి.సింహాచలం, వి.సింహాచలం కె.సింహాచలం, తిరుపతిరావు, ఎం.సూర్యనారాయణ, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు ఎస్‌.రాంబాబు, గుల్ల బాబ్జీ, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతంపేట : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ సీతంపేటలో టిడిపి నాయకులు బిడ్డిక దమయంతినాయుడు స్వగృహం వద్ద రిలేనిరాహర దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో సీనియర్‌ నేతలు పాలకొండ నియోజకవర్గం నాయకులు పడాల భూదేవి, మాజీ జెడ్‌పిటిసి సామంతుల దామోదరరావు, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ ఖండాపు వెంకటరమణ, మాజీ ఎంపిపి సుమంత్‌నాయుడు, నియోజకవర్గ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : టిడిపి మండల కన్వీనర్‌ అక్కేన మధుసూదనరావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షల్లో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మక్కువ: మండలంలోని ఎ.వెంకంపేటలో టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. తక్షణమే చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని టిడిపి మండల మాజీ అధ్యక్షులు పెంట తిరుపతిరావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.