Jun 21,2023 00:06

ప్రజాశక్తి - పెద్దాపురం ప్రజాకవి యాసలపు సూర్యారావు తన ప్రజా జీవితంలో భాగంగా కథలను కూడా భాగస్వాముల్ని చేశాడని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు అన్నారు. యాసలపు సూర్యారావు 11వ వర్థంతి సందర్భంగా స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో డాక్టర్‌ జోస్యుల కృష్ణ బాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూర్యారావు అన్ని రంగాల్లోనూ ప్రజాభిమానాన్ని పొందరన్నారు. ప్రముఖ కవి, రచయిత అద్దేపల్లి ప్రభు మాట్లాడుతూ గురజాడ దిద్దుబాటు కథ నుండి నేటి ఆధునిక కథ వరకు కథా రచనలో వచ్చిన మార్పులను వివరించారు. చల్లా విశ్వనాథం మాట్లాడుతూ యాసలపు సూర్యారావుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఈ సభలో మార్ని జానకి రామ చౌదరి, కొత్త శివ, గంగారత్నం, పూడి శ్రీనివాస్‌, రొంగల వీర్రాజు, కేదారి నాగు మాట్లాడారు. తొలుత యాసలపు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో ప్రజా నాట్య మండలి కళాకారులు దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, దారపు రెడ్డి సత్యనారాయణ, అమత, నమ్రత బందం అభ్యుదయ గీతాలు ఆలపించారు.