
ప్రజాశక్తి-విశాఖపట్నం : ఔషధ ప్రయోగాలకు జంతువులను వినియోగించే పరిశోధకులు జంతు సంరక్షణ చట్టాలను విథిగా గౌరవించాలని, ఎంతో అవసరం అనుకుంటే తప్ప వాటిపై ప్రయోగాలను జరపరాదని భారత ప్రభుత్వ జంతు సంక్షేమ విభాగం సంయుక్త కమిషనర్, కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పరిమెంట్స్ ఆన్ యానిమల్స్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ ఎస్.కె.దత్తా సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా దక్షిణాది రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, ఫార్మశీ కళాశాలలలోని పరిశోధకులకు కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనుషుల మాదిరిగా జంతువులకు మానసిక, శారీరక ఆరోగ్యం అవసరమని, అది లోపించిన పక్షంలో దాని ప్రభావం మానవ సమాజంపై పడుతుందని గుర్తించాలన్నారు. ఒకే విధమైన ఔషధ ప్రయోగాలను జంతువులపై చేయకుండా పరిశోధకుల మధ్య సమాచార భాగస్వామ్యం అవసరమన్నారు. జంతువులపై ప్రయోగాలను సమీక్షించడాని జాతీయ స్థాయిలో 19 మంది సభ్యులతో కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్ పరిమెంట్స్ ఆన్ యానిమల్స్ పనిచేస్తోందని వెల్లడించారు. దేశంలోని 17 వేల విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఎథిక్స్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. ఈ కమిటీల అనుమతి పత్రం లేకుండా జంతువులపై ఏ విధమైన పరిశోధనలు జరిపినా, పరిశోధనా ఫలితాలు ప్రకటించినా వాటికి గుర్తింపు ఉండదన్నారు.
గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి (జిమ్సర్) ప్రొ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి.గీతాంజలి మాట్లాడుతూ ఔషధ ప్రయోగాలకు జంతువులను వాడటం క్రమేణా తగ్గుముఖం పడుతోందని, ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధకులు దృష్టి సారించాలన్నారు. ప్రొఫెసర్ మళ్ళ రామారావు, ప్రొఫెసర్ గణపతి, కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పరిమెంట్స్ ఆన్ యానిమల్స్ జాతీయ సలహదారులు డాక్టర్ కృపాలి పాండే, డాక్టర్ రీచా రౌతేల, డాక్టర్ సమీక్షా సక్లాని, ఎయు ఫార్మకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఈశ్వర్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.