Jul 07,2021 06:13

    పునర్విభజన ప్రక్రియ ద్వారా జమ్మూ, కాశ్మీరు లోయల మధ్య మత విభజనను పెంచాలని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో, లోయలో ప్రధాన ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయడానికి ప్రయత్నించడంలో, కొత్త సహకార శక్తులను సృష్టించుకోవడంలో కేంద్రం, బిజెపి బిజీగా మారతాయి. సమావేశం అనంతరం ప్రధాని ట్వీట్‌ చేస్తూ, ''జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధి పథానికి మరింత ఊతమిచ్చేలా, అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడేలా, త్వరగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా పునర్విభజన జరగాల్సి వుంది.'' అని పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వం అంటే ఢిల్లీలో మాదిరిగానా లేక పుదుచ్చేరిలో మాదిరిగానా ?
    తమ హిందూత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్‌ ముఖ్య స్వభావాన్ని మార్చాలన్న ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్న కృతనిశ్చయంతో మోడీ-షా ద్వయం వున్నారు.
     జమ్మూ కాశ్మీర్‌కి చెందిన 14 రాజకీయ పార్టీల సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేయడం అసాధారణ చర్యగా కనిపిస్తోంది. రాజ్యాంగం లోని 370వ అధికరణం కింద జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని పూర్తిగా రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైగా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించడం ద్వారా, అవినీతిపరులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ద్వారా వారిని అప్రతిష్ట పాల్జేయడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేసింది. వారి రాజకీయ కార్యకలాపాలను దెబ్బకొట్టడానికి చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేశారు.
     ఇంత జరిగినా, గుప్కర్‌ అలయన్స్‌గా చిరపరిచితమైన పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ లోని పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలు మోడీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించాయి. జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ క్రమానికి సంబంధించి తాము చొరవ (అనిశ్చితితో కూడిన) చూపితే అందుకు రాజకీయ పార్టీలు స్పందించలేదని ప్రధాని, హోం మంత్రి సాకులు చెప్పకుండా వుండేలా వారు సమావేశంలో పాల్గొన్నారు.
    ఎలాంటి ఫలితం వెలువడకుండా జూన్‌ 24న సమావేశం ముగిసింది. అయితే, ఇటువంటి సమావేశం యొక్క స్వభావం, ప్రయోజనానికి సంబంధించి అన్ని రకాల వదంతులను ఇది లేవనెత్తింది.
    జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ క్రమం ప్రతిష్టంభించినందున అక్కడ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను మార్చేందుకు నరేంద్ర మోడీపై ఒత్తిడి వచ్చిందని, అందువల్లే బిజెపి ఎవరినైతే నిరసించిందో, అణచివేసిందో వారితోనే రాజకీయ క్రమాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి పెరిగిందని కొంతమంది వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అయితే అటువంటి వాదనను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే తోసిపుచ్చాలి. తమ హిందూత్వ విశ్వాసాలకు అనుగుణంగా జమ్మూ కాశ్మీర్‌ ముఖ్య స్వభావాన్ని మార్చాలన్న తమ తపనను నెరవేర్చుకునేందుకు మోడీ-షా ద్వయం నిర్ణయించారు.
మరో ఆలోచనా ధోరణి, ఈ చర్య వెనుక గల భౌగోళిక-రాజకీయ పరిశీలనలను ప్రస్తావిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు చూసినట్లైతే తాలిబన్‌ రెచ్చిపోతోంది. తేటతెల్లమవుతున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌ కీలక పాత్ర కూడా ఒక ప్రధాన కారణంగా వుంది. పైగా, సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్‌ నుండి బలగాల ఉపసంహరణను పూర్తి చేయాల్సి వున్న అమెరికా...కాశ్మీర్‌లో రగులుతున్న వివాదంతో ఇప్పటికే సంక్లిష్టంగా వున్న పరిస్థితిని దెబ్బ తినకుండా చూసేలా చర్యలు తీసుకుంటుందని భావించబడుతోంది.
ఆఫ్ఘనిస్తాన్‌ - పాకిస్తాన్‌ పరిణామాలు కచ్చితంగా భారత్‌కు ఆందోళన కలిగించేవే. కానీ, జమ్మూ కాశ్మీర్‌లో మోడీ ప్రస్తుత వైఖరికి ఇటువంటి విదేశీ అంశాలను ఒక కారణంగా పేర్కొనలేం.
మోడీ ప్రభుత్వం, బిజెపి సంకుచిత ఎజెండా నుండే ఈ సమావేశం రూపొందించింది. జమ్మూ కాశ్మీర్‌ గుర్తింపును మార్చడానికి, స్వయంప్రతిపత్తిని నిర్మూలించడానికి ఉద్దేశించిన సైద్ధాంతిక, రాజకీయ ప్రాజెక్టును మరింత బలోపేతం చేయడంపై గల ఆందోళనతోనే ఇదంతా చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా, ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న చర్యే.
370వ అధికరణను రద్దు చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి జ్యుడీషియల్‌ పరిశీలనకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం ద్వారా జనాభా నమూనాను మార్చడానికి మోడీ ప్రభుత్వం కింది స్థాయి నుండి కసరత్తు చేస్తోంది. ఇందుకోసమే కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం, రాష్ట్రం వెలుపల వారికి కూడా ఇక్కడ భూమి, ఇతర వనరులకు అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకుంది.
ఇక రాజకీయ రంగానికి వస్తే, కేంద్ర పాలిత ప్రాంతం కింద అసెంబ్లీకి కొత్త నియోజకవర్గాల విభజన కోసం పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పాత జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలో మొత్తంగా 87స్థానాలు వుండేవి, ఇందులో కాశ్మీరు లోయలో 46, జమ్మూలో 37, లడఖ్‌లో నాలుగు వుండేవి. పాకిస్తాన్‌ ఆక్రమిత ప్రాంతంలో 20 సీట్లు వుండేవి.
ఇప్పుడు కొత్త అసెంబ్లీకి 94 సీట్లు వుంటాయి. అంటే గత అసెంబ్లీ కన్నా ఏడు సీట్లు ఎక్కువ. పునర్విభజన కింద జమ్మూ ప్రాంతంలో సీట్ల సంఖ్యను పెంచుతారని భావిస్తున్నారు. ఇందులో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వ్‌డ్‌ సీట్లు కూడా వుంటాయి. అసెంబ్లీలో కాశ్మీరు లోయ ప్రాధాన్యతను తగ్గించడమే ఇక్కడ ఉద్దేశ్యం. జమ్మూలో బిజెపి ఆధిపత్యానికి హామీ కల్పించేలా సరిహద్దుల్లో మార్పులు వుంటాయి. భవిష్యత్‌లో బిజెపి పాత్ర, భాగస్వామ్యం లేనిదే జమ్మూలో ఏ ప్రభుత్వం వుండలేక పోవడమే అసలు లక్ష్యం.
పునర్విభజన ప్రక్రియ ద్వారా జమ్మూ, కాశ్మీరు లోయల మధ్య మత విభజనను పెంచాలని బిజెపి భావిస్తోంది. అదే సమయంలో, లోయలో ప్రధాన ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీయడానికి ప్రయత్నించడంలో, కొత్త సహకార శక్తులను సృష్టించుకోవడంలో కేంద్రం, బిజెపి బిజీగా మారతాయి.
జూన్‌ 24 నాటి సమావేశంలో, దిశా నిర్దేశం చాలా స్పష్టమైంది. ముందుగా పునర్విభజన తప్పనిసరి, దీనికి అన్ని పార్టీలు సహకరించాలి, దాన్ని చట్టబద్ధం చేయాలి. ఆ తర్వాత, ఎన్నికలు అటుపై సముచితమైన సమయంలో రాష్ట్ర ప్రతిపత్తి. సమావేశం అనంతరం ప్రధాని ట్వీట్‌ చేస్తూ, ''జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధి పథానికి మరింత ఊతమిచ్చేలా, అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడేలా, త్వరగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా పునర్విభజన జరగాల్సి వుంది.'' అని పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వం అంటే ఢిల్లీలో మాదిరిగానా లేక పుదుచ్చేరిలో మాదిరిగానా?
అమిత్‌ షా కూడా ఇదే వరుస క్రమాన్ని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ''పార్లమెంట్‌లో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడంలో పునర్విభజన ప్రక్రియ, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ అనేవి కీలక మైలురాళ్ళు'' అని వ్యాఖ్యానించారు.
అయితే ఏ తరహా రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తారనేది సమావేశంలో గానీ వెలుపల గానీ స్పష్టం చేయలేదు. లడఖ్‌ను కూడా చేర్చి ఐక్య జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి వుంటుందా? లేక కుదించబడిన, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే ఢిల్లీ రాష్ట్రం మాదిరిగా జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం వుంటుందా?
ఢిల్లీలో సమావేశం, దాని ఫలితం విలువను కాశ్మీరు లోయ ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారు. నిరాశ, అసహనంలో వున్న కాశ్మీరీలకు, ఢిల్లీకి మధ్య గల అంతరాన్ని ఈ సమావేశం మరింత పెంచింది. చివరగా, కాశ్మీరీల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం ద్వారా, బలవంతపు చర్యల ద్వారా మాత్రమే కేంద్రం కాశ్మీర్‌ను పాలించగలుగు తుందనడంలో సందేహం లేదు.
 

/ 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం/