Sep 21,2023 21:05

లక్ష్మీరాజ, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను అమలు చేస్తామని పాదయాత్ర సమయంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత కొత్తగా జిపిఎస్‌ను తెరపైకి తీసుకొచ్చి అమలు చేశారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిపిఎస్‌ను అంగీకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఒపిఎస్‌ అమలు కోసం అవసరమైతే ఆందోళన బాట పడుతామని చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతల
అభిప్రాయ మాలిక... జిపిఎస్‌ గొడ్డలి పెట్టు
మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని సిఎం జగన్‌ మాట ఇచ్చి తప్పారు. సిపిఎస్‌, జిపిఎస్‌ ఉద్యోగులకు ఉపా ధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం మాత్రమే అమలు చేసినప్పుడే ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జిపిఎస్‌ అమలు వారి జీవితాలకు గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇటీవల ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాం ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్‌ను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా తీసుకువచ్చిన జిపిఎస్‌ కూడా రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసే వరకు ఉద్యమాలను ఉదతం చేస్తాం.
- లక్ష్మీరాజ, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి
ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలి
ముఖ్యమంత్రి రాష్ట ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాతపెన్షన్‌ విధానాన్ని అమ లు చేసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలి. జిపిఎస్‌ విధానం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రయోజనం లేదు. జిపిఎస్‌ విధానాన్ని ఉద్యో గులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని ఎపిటియఫ్‌ తీవ్రంగా ఖండిస్తోంది. అనేక రాష్టాలు పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించడానికి ప్రయత్నాలు ప్రారంబిస్తున్న ప్రస్తుత పరిస్ధితులలో మన రాష్టప్రభుత్వం జిపిఎస్‌్‌ పేరుతో మరో కొత్త పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడం సమంజసం కాదు. జిపిఎస్‌ విధానం సిపిఎస్‌ కంటే ఏరకంగాను మెరుగైన విధానం కాదన్నారు. పాతపెన్షన్‌ విధానం అమలుకు ఎపిటిఎఫ్‌ పోరాటం చేస్తుంది.
-ఎ.శ్యామ్‌ సుందర్‌ రెడ్డి,రాష్ట ఉపాధ్యక్షులు,ఎపిటిఎఫ్‌.
ఉద్యోగులకు నిలువునా మోసం
అధికారంలోకి వచ్చిన వారంలోపే సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్‌ను అమలు చేస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి హామీల అమలు నీటిమూటలయ్యాయి. ఇంతకాలం ఒపిఎస్‌ కోసం ఎదురు చూస్తున్న సిపిఎస్‌ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టి ,ప్రత్యామ్నాయంగా జిపిఎస్‌ను అమలు చేస్తామనడం విడ్డూరం. ఎటువంటి హామీ ఇవ్వని మనకంటే చిన్నరాష్ట్రాలు సిపిఎస్‌ను రద్దు చేస్తుంటే, హామీ ఇచ్చిన మన రాష్ట్రంలో మాత్రం తలాతోక లేని జిపిఎస్‌ను అమలు చేస్తామని చెప్పడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం. ఎట్టి పరిస్థితిలోనూ జిపిఎస్‌ను అంగీకరించబోం.
-పి.రమణారెడ్డి-ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు
జిపిఎస్‌ ఖండిస్తున్నాం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి. జిపిఎస్‌ వల్ల ఉద్యోగులకు ప్రయోజనం లేదు. సిపిఎస్‌ కోసం పోరాడుతూ ఉన్నాం. జిపిఎస్‌ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. తమిళనాడులో సిపిఎస్‌ అమలు చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వమూ ఒపిఎస్‌ను అమలు చేయాలి.
- పి. మహబూబ్‌ ఖాన్‌, జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ టీచర్స్‌ అసోసియేషన్‌.
జిపిఎస్‌ను ఆమోదించడం దారుణం
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రతలేని, ఆమోదం లేని గ్యారెంటీ పెన్షన్‌ స్కీం (జిపిఎస్‌ )ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని ఖండిస్తున్నాం. ఈ పెన్షన్‌ స్కీం పేరులోనే గ్యారెంటీ ఉంది కానీ పెన్షన్‌ ఇవ్వడంలో మాత్రం గ్యారెంటీ లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో సిపిఎస్‌ ను రద్దుచేసి ఓ పి ఎస్‌ ను అమలు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇచ్చిన హామీ ప్రకారంపాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి.
- రాళ్లపల్లి అబ్దుల్లా ఏపీపీఎఫ్‌ 1938 రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు
జిపిఎస్‌ బలవంతంగా రుదొద్దు
రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ అమలు చేయకుండా జిపిఎస్‌ బలవంతంగా రుద్దవద్దు. అనేక రాష్ట్రాలు సిపిఎస్‌ అమలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని కోరుతూ ఉన్నాం. గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌లో ఉద్యోగులకు, ఉపాధ్యా యులకు గ్యారెంటీ లేదు. పాదయాత్ర సందర్భంలో వై.ఎస్‌. జగన్‌ ఇచ్చిన హామీని పక్క పెట్టి జిపిఎస్‌ను అమలు చేయడం దారుణం.
-సయ్యద్‌ ఇక్బాల్‌ , 'రూట' రాష్ట్ర ప్రధాన కార్యదర్శి