Oct 24,2023 20:03

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎపిటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సిపిఎస్‌, జిపిఎస్‌ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న డిఎ, ఎరియర్స్‌, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ వంటి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 29న విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద చేపట్టిన మెగా ధర్నాను విజయవంతం చేయాలని ఎపిటిఎఫ్‌ (1938) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎ.సదాశివరావు, జిల్లా అధ్యక్షులు డి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఎపిటి ఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిపిఎస్‌ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఆర్ధిక భారం అని కుంటి సాకులతో నేడు సిపిఎస్‌ కంటే ప్రమాదకరంగా ఉన్న జిపిఎస్‌ను తీసుకు రావడం అన్యాయ మన్నారు. ఎటువంటి చట్ట బద్ధత లేని జిపిఎస్‌ను రద్దు చేయాలని, అదే విధంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ, పిఆర్‌సి ఎరియర్స్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ 29న విజయవాడలో జరిగే ధర్నాకు ఉపాధ్యాయులంతా హాజరు కావాలని కోరారు.