నిరసన తెలుపుతున్న ఫ్యాప్టో సభ్యులు
ప్రజాశక్తి - గోనెగండ్ల
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పింఛను స్థానంలో జిపిఎస్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించడంపై శుక్రవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. మండలంలోని హెచ్.కైరవాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ గట్టు తిమ్మప్ప, ప్రధానోపాధ్యాయులు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ... జిపిఎస్ అమలుపై నిరసనలో భాగంగా నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారన్నారు. 23న సాయంత్రం అన్ని తాలూకా కేంద్రాల్లో జరిగే నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 25న కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.










