
ప్రజాశక్తి-యంత్రాంగం
జిఒ 1 తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పలుచోట్ల మంగళవారం నిరసనలు మిన్నంటాయి.
గాజువాక: జిఒ 1 ను వ్యతిరేకిస్తూ, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ గాజువాక జోనల్ కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యాన నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు అవుతున్నా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జిఒ 1ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిఒ 1 కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు, రమణ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
కంచరపాలెం : జిఒ 1 ద్వారా మున్సిపల్ కార్మికుల శాంతియుత పోరాటాన్ని పోలీసులు భగం చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రైతుబజార్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అక్కడ జిఒ 1 కాపీలను దగ్ధంచేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ సెక్రటరీ ఒ అప్పారావు, నాయకులు బి.సింహాచలం, ఎమ్.ఈశ్వరరావు, పి.మూర్తి, ఎస్ శ్రావణ్, మహేశ్వరి, పి.రాజు, సీత, శ్రీనివాస్, కంతల్లి తదితరులు పాల్గొన్నారు.
పిఎం పాలెం : మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులు ఖండిస్తూ, జిఒ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మధురవాడ జోనల్ కార్యాలయం కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.రాజుకుమార్, డికె.అప్పలరాజు, ఎంవి.ప్రసాద్, సిహెచ్.శేషుబాబు, కె.నాగరాజు, ఎస్.రామప్పడు, జి.విజరు, కె.కొండమ్మ, ఎం.ఆదిలక్ష్మి, నర్సింగ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ లేబర్ గేటు, బీసీ గేట్ల వద్ద కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యాన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిఒ 1ను తక్షణమే రద్దుచేయాలని నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిఒ 1ను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.సత్యవతి పాల్గొన్నారు.
లీగల్ విలేకరి : అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జిఒ -1 పై న్యాయవాద సంఘాలు, రాజకీయ పార్టీల లీగల్ సెల్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిఒ 1 రాజ్యాంగ విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తుందని, వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, విశాఖపట్నం యూనిట్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బివి రామాంజనేయరావు, ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వరరావు, చాట్ల ఆనందరెడ్డి, కార్యదర్శులు బగాది తులసీదాసు, ఐఎఎల్ ప్రధాన కార్యదర్శి అజరు కుమార్ సీనియర్ న్యాయవాది ఐఎం అహమ్మద్, టిడిపి లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్, జనసేన లీగల్ సెల్ ప్రతినిధి కళావతి, వివిధ న్యాయవాద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.