ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో గిరిజన సంఘం కార్యాలయం వద్ద ఆ సంఘం మండల కార్యదర్శి కొర్ర నర్సయ్య విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ, జీవో 3 పునరుద్ధరణ చేసి, నూటికి నూరు శాతం రిజర్వేషన్లు గిరిజనులకు వర్తించేలా చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూరు శాతం రిజర్వేషన్ల పై గిరిజన ఎంఎల్ఏలు అసెంబ్లీలో ప్రతిపాదన చేయాలని కోరారు.పాడేరు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సుమారు 400 మంది గిరిజనేతర రెగ్యులర్ ఉపాధ్యాయులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులను, చట్టాలను కాలరాస్తుందన్నారు.గిరిజనుల హక్కుల, చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రివ్వు పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతం నుండి బదిలీ చేయడంతో గిరిజన నిరుద్యో గులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులను కాలరాయడం సరికాదన్నారు.ఈ సమావేశంలో గిరిజన మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, జిల్లా నాయకులు కె త్రినాధ్, మండల నాయకులు నారాయణ, జీనబంద్, జర్రెల ఉప సర్పంచ్ వి.గణపతి, కామేశ్వరరావు పాల్గొన్నారు.










