ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు సంబంధించి ఐదుశాతం భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాల్సిందిగా గతంలో జారీ చేసిన జివో 145ను రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్తగా జివో 13ను విడుదల చేయడం హర్షణీయమని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్హెంట్ కౌన్సిల్ (నరెడ్కో) విజయవాడ ఛాప్టర్ అధ్యక్షులు అమరనాథ్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జివో నెంబర్ 145ను రద్దు చేయడం వలన రియల్ ఎస్టేట్ నిర్వాహకులు లాభదాయకంగా ఉంటుందన్నారు. భవన నిర్మాణ దారులు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సందర్భంగా జివో 145 రద్దు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి, మునిసిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీకి ధన్యవాదములు తెలియచేశారు. ఈజివో రద్దు చేయడం వలన రియల్ ఎస్టేట్ గతంలో నెమ్మదగా ఉందని దీనితో రియల్ ఎస్టేట్ రంగం పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే నిర్మాణ రంగానికి సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని వాటిని కూడా పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో నరెడ్కో సిటీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ రాజ్కుమార్, సభ్యులు జి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.










