
ప్రజాశక్తి-యంత్రాంగం
రాష్ట్రంలో రోడ్డుషోలు, బహిరంగసభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జిఒ 1 రద్దుచేయాలని కోరుతూ పలుచోట్ల టిడిపి ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పెందుర్తి : పెందుర్తి కూడలిలో టిడిపి నాయకులు నిరసనల తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు సభకు జనాలు అధిక సంఖ్యలో హాజరుకావడంతో చూసి ఓర్వలేక జగన్మోహన్రెడ్డి చీకటి జిఒలను తెచ్చారని విమర్శించారు. లోకేష్ను హేళన చేసిన వైసిపి నాయకులు ఆయన పాదయాత్రకు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బల్లా శ్రీనివాసరావు, రెడ్డి నారాయణరావు పాల్గొన్నారు.
ఆరిలోవ : టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, బుడుమూరు గోవిందు ఆధ్వర్యాన పెదగదిలి కూడలి వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పెదగదిలి కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జిఒ పత్రాలను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గాడి సత్యం, పోలారావు, యేడువాక సన్యాసిరావు, బాలరాజు, దువ్వి తాతారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ : రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబరు 1 అప్రజాస్వామికమైనదని సిపిఐ పేర్కొంది. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిఒ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చట్టం విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన జిఒ ముఖ్యమంత్రికి వర్తించదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్కె.రెహమాన్, జి.రాంబాబు, వై.రాంబాబు, ఎ.దేముడమ్మ తదితరులు పాల్గొన్నారు.