
ప్రజాశక్తి- శృంగవరపుకోట : పట్టణంలోని సిరికి రిసార్ట్స్ ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 బాల బాలికల బాడ్మింటన్ సెలక్షన్స్ అండ్ టోర్నమెంట్ను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలో గల 8 నియోజకవర్గాల నుండి దాదాపు 160 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్, టోర్నమెంట్లో పాల్గొంటున్నారన్నారు. ఇక్కడ ఎంపికైన టీమ్ విశాఖపట్టణంలో నవంబరు 9 నుండి 11 వరకు జరుగబోవు రాష్ట్రస్థాయి పోటీలలో విజయనగరం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా విజయదుందుభి మోగించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీలకు ఆతిధ్యమిచ్చిన సిరికి రిసార్ట్స్ యాజమాన్యం, క్రీడాకారులకు భోజనాలు ఏర్పాటు చేసిన ముంతాజ్ బ్రదర్స్, అరటిపళ్ళు సమకూర్చిన మంథా సుబ్బారావు, మజ్జిగ ప్యాకెట్లు సమకూర్చిన పాలకుర్తి శివకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు, జిల్లా ఎస్జిఎఫ్ కార్యదర్శి ఎల్.వి.రమణ, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఎన్. వెంకటనాయడు, విడిఎస్ఎస్ఎస్ఎ కార్యదర్శి లక్ష్మణరావు, వ్యాయామ ఉపాధ్యాయులు స్వరూప్, శాంతి, పాప, జగదీష్, లక్ష్మణరావు పాల్గొన్నారు.
అండర్ 19 బాస్కెట్ బాల్ జిల్లా జట్లు ఎంపిక పూర్తి
విజయనగరం టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈనెల 28,29,30 తేదీల్లో జరగనున్న రాష్ట్ర అండర్ 19 బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక గురువారం విజ్జి స్టేడియంలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు హాజరు కాగా, వారిలో 12 మంది బాలురు, 12 మందితో బాలికల జట్లను ఎంపిక చేసినట్లు అండర్ 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి వివిఎల్ఎన్ కృష్ణ తెలిపారు. విద్యార్థుల్లో ఉండే సామర్ధ్యం, ప్రతిభను గుర్తించి జిల్లా జట్లుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
పీడీకు కబడ్డీలో కాంస్య పతకం
డెంకాడ: ఇటీవల ఢిల్లీలో జరిగిరన అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల ఆటల పోటీల్లో కబడ్డీ విభాగంలో మండలంలోని రఘుమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కూర్మాను భాను పాల్గొని కాంస్య పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన్ను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర రెడ్డి, ఉప విద్యాశాఖాధికారి పి వాసుదేవరావు, బ్రహ్మాజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.