ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో ఆరేడేళ్లుగా ఖాళీగా ఉన్న 200 నాలుగో తరగతి ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాజ్యోతి, నాట్కో క్యాన్సర్ విభాగం హెచ్ఒడి డాక్టర్ దుర్గా ప్రసాద్, వైద్యులతో మంగళవారం సమీక్షించారు. ఈ పోస్టులను ఇప్పటి వరకూ భర్తీ చేయకపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో ఎవరూ ఎందుకు స్పందించలేదో, ఆసలు ఈ పోస్టులు ఉన్నాయో లేదో తెలియదు. నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినా భర్తీ చేయలేక పోవడాన్ని గుర్తించారు. పోస్టులపై వివరాలను అసిస్టెంట్ డైరెక్టర్ (పరిపాలన విభాగం) నాగేశ్వరావు నుంచి సేకరించారు. పోస్టుల నియామకం, కన్వెర్షన్ కోసం వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డిఎంఇ) కు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. సమీఓలో సివిల్ సర్జన్ ఆర్ఎంఒ డాక్టర్ సతీష్ కుమార్, క్యాన్సర్ విభాగం వైద్యులు డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ జాహ్నవి, నాట్కో సమన్వయకర్త అశోక్ కుమార్, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.










