ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.చంద్రమౌళీశ్వరి బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, మానసిక వ్యాధుల వార్డును సందర్శించారు. రోగులకు అందుతున్న సేవల గురించి ఆ విభాగం వైద్యులతో ఆమె సమీక్షించారు. వ్యాధిగ్రస్తులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. రోగులు వారికి అందుతున్న వైద్యం పట్ల సంతృప్తిని వెలిబుచ్చారు. వైద్యులు ఈ విభాగాన్ని ఎంచుకోవటం అరుదుగా కనిపిస్తారని, కావున ఈ విభాగంలో పనిచేస్తున్నందుకు అక్కడున్న వైద్యులను అభినందించారు. మహిళా వైద్యులు కూడా ఉండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలుత రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు న్యాయ పరమైన సమస్యలు ఉంటే ఆసుపత్రిలోని లీగల్ ఏయిడ్ క్లినిక్ను సంప్రదించి, న్యాయ సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో సహాచార్యులు వి.వి.కిరణ్, సహాయ ఆచార్యులు సాయి కిరణ్, మాజీ అదనపు పిపి కట్టా కాళిదాసు, వైద్యులు సాయికష్ణ, నిమిషా, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.










