Feb 23,2023 00:19

జి-20 సదస్సు నిర్వహణపై చర్చిస్తున్న రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి

ప్రజాశక్తి-విశాఖపట్నం : వచ్చే నెల 28,29 తేదీలలో నిర్వహించబోయే జి-20 సదస్సు నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని రాష్ట్ర ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఉడా కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జి-20 సదస్సు నిర్వహణ కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. మార్చి 27వ తేదీన వివిధ దేశాల నుంచి సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతంపలకడంతో పాటు ఎయిర్‌ పోర్టు నుంచి వారికి ఏర్పాటుచేసిన హోటల్‌ వరకు తీసుకెళ్లేందుకు అవసరమైన రవాణా, లైజినింగ్‌, డెలిగేట్‌ కిట్స్‌ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌కు పలు సూచనలుచేశారు. విదేశీ ప్రతినిధులు జిల్లాలో పర్యటించిన సందర్భాలలో భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు గురించి నగర పోలీసు కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌నడిగి తెలుసుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులకు జిల్లాలో టూరిజం ప్రాంతాలైన సబ్‌ మేరైన్‌ మ్యూజియం, తొట్లకొండ తదితరాలు సందర్శించు నిమిత్తం తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధంగా నగరాన్ని సుందరంగా ఆధునీకరించాలని జివిఎంసి కమిషనర్‌కు సూచించారు. చివరి రోజున ఆరోగ్యాన్ని మెరుగు పరిచే యోగా, మెడిటేషన్‌ తదితర కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు శ్రీలక్ష్మికి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున వివరించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాధన్‌, డిసిపి సుమిత్‌ సునీల్‌ గరుడ్‌, టూరిజం డైరక్టర్‌ మల్లికార్జునరావు, టూరిజం, పోలీసు, రెవెన్యూ, జివిఎంసి, ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి విమానాశ్రయానికి వెళ్లి విదేశీ ప్రతినిధుల రాక సందర్భంగా చేపడుతున్న పనులను పరిశీలించారు.