May 23,2023 00:41
గడప గడపకూలో ప్రజలతో మాట్లాడుతున్న బాచిన కృష్ణ చైతన్య

ప్రజాశక్తి-పంగులూరు: పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరుస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించాలని, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణ చైతన్య కోరారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా, మూడో రోజు అయిన సోమవారం సాయంత్రం ముప్పవరం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోని పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని, ఆ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త పథకాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటున్న వైసీపీని, జగన్‌ మోహన్‌రెడ్డిని విమర్శించటమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని అన్నారు. ప్రతి ఇంటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను గృహ యజమానులకు చూపుతూ, ఆ పథకాల ద్వారా ఆ కుటుంబాలు ఎంత లబ్ధి పొందింది కృష్ణ చైతన్య వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సేవాదళ్‌ బాపట్ల జిల్లా అధ్యక్షులు పులికం కోటిరెడ్డి, గ్రామ సర్పంచి సాంబశివరావు, ఎంపీటీసీ గంగాధర్‌, ఎంపీడీవో రమణమూర్తి, మండల ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్‌ రెడ్డి, మండల అభికృద్ధి కమిటీ అధ్యక్షులు రాయిని వెంకటసుబ్బారావు, వైసిపి స్థానిక నాయకులు శంకర్‌రెడ్డి, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.