Jul 29,2021 12:36

అమరావతి : జగనన్న విద్యాదీవెన రెండో విడతగా రూ. 693 కోట్లు నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. విద్యార్ధుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేసినట్లు ప్రకటించారు. విద్యా దీవేన కానుక రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది తమ తాపత్రాయమని తెలిపారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా చదువులో ఇంకా మనం వెనుకబడి ఉన్నామని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం మంది చదువురానివారు ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో వీరి సగటు 27 శాతంగా ఉందని తెలిపారు. బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే మన దేశంలో.. ఇంటర్‌ తర్వాత డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్‌ లో మూడో విడత నిధులు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు.