ప్రజాశక్తి-పాడేరు టౌన్: పిల్లల చదువుల నిమిత్తం తల్లుల ఖాతాలకు రూ. 4 కోట్ల 96 లక్షల 67 వేల నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారని టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు అన్నారు. ఆదివారం ఎన్టిఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ కార్యాలయం నుండి అధికారులు, తల్లులు, విద్యార్థులు వీక్షించారు. కంప్యూటర్ బటన్ నొక్కి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 12,651 మంది తల్లులు ఖాతాకు విద్యా దీవెన నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 1736 మంది బిసి విద్యార్థులకు రూ.97 లక్షల 47వేలు, 340 మంది ఎస్సి విద్యార్థులకు రూ.29 లక్షల 74వేలు, 11 మంది క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు 1లక్ష ఇరవై ఎనిమిది వేలు, 48 మంది ముస్లిం మైనార్టీలకు రూ.3 లక్షల 8వేలు, 10,516 మంది గిరిజన విద్యార్థులకు రూ.3 కోట్ల 65 లక్షలు 8వేలు నగదును తల్లులు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందన్నారు. యాజమాన్యాలకు తల్లులు చెల్లించాలని సూచించారు. అనంతరం పాడేరు ఐటిడిఎ పరిధిలోని విద్యార్థులకు, తల్లులకు రూ.3 కోట్ల 65 లక్షల 8వేల నమూనా చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎటిడబ్ల్యూఒ ఎల్.రజిని, సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డి, పలువురు తల్లులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










